ఆంధ్రప్రదేశ్ ను మన దేశపు అన్నపూర్ణగా అభివర్ణిస్తారు. మరి మన రాష్ట్రంలో వాస్తవ పరిస్థితులు ఎలా ఉన్నాయి? దేశానికే వెన్నెముకగా భావించే మన రైతు పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి కూలంకషంగా పరిశీలిద్దాం రండి!,
అసలు ఒక ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం, మన దేశంలో 1992 నుండి 2007 మధ్య ప్రతి 32 నిమిషాలకి ఒక రైతు చనిపోయాడు. అందులో 86 .7 శాతం మంది రుణాల వాళ్ళ ప్రాణాలు తీసుకున్న వాల్లే. చనిపోయిన వారి సగటు అప్పు 57 ,600 రూపాయలు. NCRB (National Crime Reports Bureau) నివేదిక ప్రకారం మొత్తం 1995 -2015 మధ్యలో 3,18,528 మంది చనిపోయారు.
2022 కల్లా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చి రైతుల దిగుబడిని రెట్టింపు చేస్తామని మన ప్రభుత్వాలు చెబుతున్నా దేశంలోని వాస్తవ గణాంకాలు ఆ దిశలో లేవు . గ్రామాలలో వ్యవసాయం మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు, వాటి ఆదాయం తగ్గడమే ఇందుకు నిదర్శనం.
ఎంఎస్ స్వామినాథన్ నేతృత్వంలోని హరిత విప్లవానికి 50 ఏళ్ల నిండినా కూడా , నేటికీ కేంద్రం, రాష్ట్రాలలో వివిధ ప్రభుత్వాలు రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య ధోరణితో విసిగి వేసారిన అన్నదాత ఆగ్రహముతో వందల మైళ్లు నడుస్తూ ఆందోళనలు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం.
ప్రస్తుత ప్రరిస్థితులు
ఎన్నో వ్యయప్రయాసలకోర్చి చేతికి వచ్చిన పంట ఆదాయాన్ని అప్పులు మింగేస్తున్నాయి. తాజాగా అగస్ట్ లో జాతీయ వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డ్) విడుదల చేసిన 2016-17 'అఖిల భారత గ్రామీణ సమ్మిళిత ఆర్థిక సర్వే: '(నాబార్డ్ ఆల్ ఇండియా రూరల్ ఫైనాన్షియల్ ఇన్క్లూజన్ సర్వే-ఎన్ఏఎఫ్ఐఎస్) అధ్యయనాన్ని పరిశీలిస్తే; మన గ్రామీణ ప్రాంతాలలోని 52.5 శాతం రైతు కుటుంబాలు ఇంకా అప్పుల ఊబిలో నే బతుకుతున్నాయి.
మన దేశ వ్యవసాయ కుటుంబాల సగటు నెల ఆదాయం రూ. 8,931. చొప్పున సంవత్సరానికి వారి ఆదాయం రూ. 1,07,412. మరోవైపు వారి సగటు అప్పు కూడా అంతేమొత్తం లో రూ. 1,04,602 ఉంది.
అంటే, రైతుకు వచ్చే రాబడి అంతా అప్పులు తీర్చడానికే సరిపోతుంది. ఇలా దేశం లోనే గరిష్టంగా మన రాష్ట్రంలోని 76 శాతం మంది రైతులు, తెలంగాణాలో 79 శాతం మంది అప్పుల ఊబిలో ఉన్నారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ 83,040 సగటు వార్షిక ఆదాయం తో దేశంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది.
చిగురిస్తున్న ఆశలు
ఒకపక్క 20 శాతం ఎరువులు ఖరీదు పెరుగుదలతో రైతులపై భారం పెరుగుతుంటే, ప్రత్యామ్నాయంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం, సుభాష్ పాలేకర్ గారి పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతులకు 2014 -15 లో శ్రీకారం చుట్టింది . 2018 -19 సంవత్సరానికి గాను 5 లక్షల మందితో కొనసాగిస్తూ, 2024 సంవత్సరానికి ఆంధ్ర ప్రదేశ్ మొత్తం ఈ పద్ధతులు వాడేలా రైతులను ప్రోత్సహిస్తుంది. వీటితో పాటుగా పలు రైతు సాధికార సంస్థలు సహజ ఆహార పద్దతులపై రైతులను చైతన్యవంతం చేస్తున్నాయి. ఇటు యువతకుడా వివిధ రకాల వాణిజ్య పంటల్ని పండిస్తూ వైవిధ్యమైన పద్దతులలో మార్కెటింగ్ చేస్తూ , వ్యవసాయ రంగ భవిష్యత్తుకి కొత్త ఊపిరి ఊదుతున్నారు
అయితే వీటితో రైతుల ఋణ భారాన్ని తగ్గించి భూమి సారాన్ని మరియు మన ఆరోగ్యాలను కొంతవరకు కాపాడుకోగలిగినా, సంపూర్ణమైన ప్రతిఫలాన్ని రాబట్టేందుకు స్వామినాథన్ కమిటీ సిఫారసులను కూడా అమలు చేయగలిగితే, రైతుల పరిస్థితి ఇంకా మెరుగు పడుతుంది.
అసలేమిటీ స్వామినాథన్ కమిటీ సిఫార్సులు ?
2004 లో భారత ప్రభుత్వం MS స్వామినాథన్ అధ్యక్షతన రైతులపై ఒక జాతీయ కమిషన్(NCF) ని నియమించింది. ఆ కమిటీ 2006 ప్రభుత్వానికి అందించిన నివేదికలో పొందుపరిచిన కొన్ని అంశాలు.
• భూ సంస్కరణలు :
మన దేశంలోని మిగులు మరియు వ్యర్ధ భూముల పంపిణీ చేసి, వ్యవసాయ మరియు అటవీ భూములను, కార్పొరేట్ ధారాదత్తం కాకుండా చూడటం మరియు ఇటువంటి కేటాయింపులపై నిర్ణయాలు తీసుకోటానికి నేషనల్ ల్యాండ్ యూజ్ అడ్వైసరీ సర్వీస్ ని ఏర్పాటు చేయటం.
• నీటిపారుదల సంస్కరణలు:
రైతులందిరికి సకాలంలో తగినంత సాగునీరు అందించడానికి 11 వ పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రత్యేక పెట్టుబడులు పెట్టాలి. వాటితోపాటు వర్షపు నీటిని సరిగా వినియోగించుకోవడం, జలాశయాల ద్వారా భూగర్భ జలాల పరిరక్షణ మరియు పది లక్షల ప్రైవేట్ బావుల ఆధునీకరణ మొదలగునవి ప్రధానాంశాలు.
• ఉత్పాదకత పెరుగుదల:
అధిక ఉత్పాదకత సాధించే లక్ష్యాన్ని సాధించాలనే లక్ష్యంతో , "వ్యవసాయం, పారుదల, భూమి అభివృద్ధి, నీటి పరిరక్షణ, పరిశోధన అభివృద్ధి మరియు రహదారుల అనుసంధానం మొదలైన వాటిలో ప్రభుత్వ పెట్టుబడుల పెంచాలని NCF సిఫార్సు చేసింది .
భూసార పరీక్షల కోసం ఆధునిక ప్రయోగశాలను రైతులకు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేయాలని సూచించింది .
• పంట రుణాలు మరియు భీమా:
అధికారిక క్రెడిట్ వ్యవస్థ విస్తరణ; పంట రుణ వడ్డీ రేట్లను 4% కు తగ్గించటం ; రుణ పునరుద్ధరణకు తాత్కాలిక నిషేధాన్ని అందించడం; మహిళా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు;
రైతులకు - పంటలకు మరియు పశువులకు ఒక ఇంటిగ్రేటెడ్ ఆరొగ్య భీమా ప్యాకేజీ; తక్కువ ప్రీమియంలతో అన్ని పంటలకు దేశవ్యాప్తంగా పంట భీమా; పేదలకు నిలకడ జీవనోపాధి, రైతుల జీవన ప్రమాణాల అభివృద్ధిలో పెట్టుబడి; సంస్థాగత అభివృద్ధి సేవలు మొదలైనవి ఉన్నాయి.
• ఆహార భద్రత
విశ్వవ్యాప్త ప్రజా పంపిణీ వ్యవస్థను అమలు మిషన్ సిఫారసు చేసింది; పంచాయితీలు మరియు స్థానిక సంస్థల భాగస్వామ్యంతో ఆహార పోషకాల మద్దతు కార్యక్రమాలను పునర్వ్యవస్థీకరించి సూక్ష్మపోషకాహార లోపం నిర్మొలించేలా చర్యలు తీసుకోవాలి ;
మహిళా స్వయం సహాయక బృందాల ఆద్వర్యంలో కమ్యూనిటీ ఆహార మరియు నీటి బ్యాంకులను ఏర్పాటు చేయాలి ;
చిన్న మరియు సన్నకారు రైతులకు సహకారం అందేలా ఉపాధి హామీ పథకాలతో కూడిన జాతీయ ఆహార భద్రత చట్టాన్ని తీసుకురావాలి.
• రైతు ఆత్మహత్యల నివారణ
గ్రామాల్లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల్లో మెరుగైన వైద్య వసతులు, రైతులకు ఆరోగ్య భీమా కల్పించడం;
ఆత్మహత్యలు ఎక్కువగా జరుగే ప్రదేశాలని గుర్తించి , జాతీయ గ్రామీణ ఆరోగ్య మిషన్ ని విస్తరించాలి;
వివిధ ప్రాంతాల రైతు ప్రతినిధులతో రాష్ట్ర స్థాయి రైతుల కమీషన్లు ఏర్పాటు చేయాలి, సూక్ష్మఋణ విధానాల పునర్నిర్మాణము;
పంట భీమా ద్వారా అన్ని రకాల పంటలను పంట భీమా కవర్ చేయాలి ; వయసు పైబడిన రైతులను ఆదుకునేలా చర్యలు తీసుకోవాలి.
-
అయితే దశాబ్దాలుగా మన ప్రభుత్వాలు సబ్సిడీలు మరియు రుణ మాఫీ లాంటి స్వల్పకాల ప్రయోజనాలపై ఎక్కువ దృష్ఠ్తి పెట్టాయి. అయితే ఇప్పటికైనా ప్రభుత్వం దీర్ఘకాలిక సాంఘిక సంక్షేమ విధానాలను రూపొందించి, వాటిని క్షేత్రస్థాయిలో అమలు అయ్యేలా చూడగలిగితే రైతన్నని మిన్నగా చూడాలన్న మన కల సాకారమవుతుంది.
అఖిల్ నిమ్మగడ్డ
సామాజిక వ్యవస్థాపకుడు (Socioprenuier )
#Team AgriSoldiers
ఐక్యరాజ్యసమితి రిపోర్ట్
http://www.un.org/esa/sustdev/csd/csd16/PF/presentations/farmers_relief.pdf
నాబార్డ్ రిపోర్ట్
https://www.nabard.org/auth/writereaddata/tender/1608180417NABARD-Repo-16_Web_P.pdf
స్వామినాథన్ కమిటీ రిపోర్ట్
http://www.prsindia.org/administrator/uploads/general/1242360972~~final%20summary_pdf.pdf
పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతుల రిపోర్ట్
https://www.youtube.com/watch?v=BGr0Qo_x0qU
జాతీయ నేర నివేదికలు బ్యూరో రిపోర్ట్
We're super excited to have you here!
This website uses cookies to enhance your User Experience.